అమరావతి : కియా కార్ల పరిశ్రమ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెచ్చారని చెప్పడం వైసీపీ అబద్దాలకు పరాకాష్ట అని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఇవాళ టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాజధాని నగరం అమరావతిని అప్రతిష్ట పాలు చేస్తున్నారన్నారు. సున్నా వడ్డీ రుణాలు టీడీపీ ఇవ్వలేదని జగన్ చెప్పారని, ఆధారాలతో సహా బయటపెట్టేసరికి ప్లేట్ ఫిరాయించారని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశంపై ఆరోపణలకే సభా సమయాన్ని వైసీపీ వృథా చేస్తుందని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేక టీడీపీని లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు. ఐదేళ్లలోనే 66 శాతం పోలవరం పనులను తెలుగుదేశం పూర్తి చేసిందన్నారు. కేంద్రం నుంచి పెండింగ్ నిధులు తీసుకురాలేకే వైసీపీ ఆరోపణలు చేస్తోందన్నారు. ఆగిపోయిన పనులు ప్రారంభించడం వైకాపాకు చేతకాదన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పనులు పడకేశాయన్నారు. పీపీఏలపై బురద జల్లాలనే ప్రయత్నం అభాసుపాలైందన్నారు.