తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు సోమవారం మహాపూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. ఉదయం మూలవర్లకు అభిషేకం, మహాపూర్ణాహుతి, పవిత్ర సమర్పణ నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీపనైవేద్యాలు సమర్పించారు. సాయంత్రం 6.30 గంటల నుండి 9 గంటల వరకు పంచమూర్తులైన శ్రీసోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, వళ్లి దేవసేన సమేత శ్రీసుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివారి వీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. పవిత్రోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు పవిత్రమాల, తీర్థప్రసాదాలు అందజేశారు.