తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్.నరసింహన్ సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద గవర్నర్ దంపతులకు టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి ఏ.వి.ధర్మారెడ్డి సివిఎస్వో గోపినాథ్జెట్టి సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం ”ఇస్తికఫాల్” ఆలయ మర్యాదలతో ఆగమోక్తంగా స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం గవర్నర్ శ్రీవారిని దర్శించుకున్నారు.అనంతరం శ్రీవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తరువాత రంగనాయకుల మండపంలో గవర్నర్ దంపతులకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా తిరుమల ప్రత్యేకాధికారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందించారు.
ముందుగా క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ గవర్నర్ దంపతులు శ్రీ వరహస్వామివారిని దర్శించుకున్నారు.