50 కుటుంబాలకి ఒక వాలంటీర్ ను నియమించడం ద్వారా నిరుద్యోగ సమస్య సమసిపోతుందని వైసిపి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడాన్ని తప్పుబట్టారు తూర్పు గోదావరి జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి బోళ్ళ వెంకట రమణ. రాజోలులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల ఉద్యోగాలు వైసిపి కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్న విషయాన్ని జనం గమనించారని అన్నారు. దీంతో నిరుద్యోగ యువతకు ఏ విధమైన ప్రయోజనం లేదని, రద్దు చేసిన నిరుద్యోగభృతిని వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేసారు.
గత అయిదేళ్ళలో కేంద్రం నుండి ఎలాంటి సహకారం లేకున్నా అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు వేల కోట్ల రూపాయలను వెచ్చించి చంద్రబాబు ముందుకు నడిపించగా అధికారంలోకి వచ్చిన వైసిపి ఆ పనులన్నీ కుంటుపడేలా చేసిందని, ఇందుకు బడ్జెట్లో ఉంచిన ప్రతిపాదనలే నిదర్శనమన్నారు. రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడుదారులను వెళ్లగొట్టే ప్రక్రియ కూడా వైసిపి నేతలు ఆరంభించేరని రమణ విమర్శించారు.