తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల రద్దీ కొనసాగుతుండడంతో సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 18వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో బ్రేక్ దర్శనాలు ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితమని, సిఫార్సు లేఖలు స్వీకరించబడవని ఆదివారం టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. వేసవి రద్దీ నేపథ్యంలో సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని గతేడాది తరహాలోనే ఏప్రిల్ 15 నుండి జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేసిన విషయం విదితమే. భక్తుల రద్దీ కొనసాగుతుండడంతో టిటిడి ఈ నిర్ణయాన్ని మరో నెల పాటు పొడిగించింది. అదేవిధంగా, శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, బుధవారం ఆణివార ఆస్థానం ఉన్న కారణంగా జూలై 16, 17 తేదీల్లో బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు పరిమితం చేసినట్టు టిటిడి తెలియజేసింది.