తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆదివారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్ఠాభిషేకం ఘనంగా ముగిసింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు కవచాలను ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత శతకలశ స్నపనం, మహాశాంతి హోమం చేపట్టారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారిని కల్యాణమండపంలోకి వేంచేపు చేసి వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పంచామృతం వివిధ రకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. కవచ ప్రతిష్ట, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మఘోష వినిపించారు. ఆస్థానం నిర్వహించిన తరువాత స్వామి, అమ్మవార్లకు కవచ సమర్పణ చేశారు.