దేశంలోనే ఏపీ పోలీసు వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అమరావతిలో రెండో రోజు కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో సీఎం మాట్లాడుతూ… అభివృద్ది చెందిన దేశాల్లో పోలీసులను ప్రజలే ఎన్నుకుంటారన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో పోలీసుల పాత్ర చాలా కీలకమన్నారు. 2లక్షల మంది ప్రజలు కలిసి ఒక ఎమ్మెల్యేను ఎన్నుకుంటారన్నారు. ఒక ఎమ్మెల్యే ఒక సమస్య తీసుకొచ్చినప్పుడు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఒక సమస్య ఉందని ఎవరైనా మన వద్దకు వచ్చినప్పుడు వారి బాధను ఓపిగ్గా వినాలన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్ల సమావేశంలో ప్రత్యేక హోదా ఉద్యమ కేసులపై ప్రస్తావన రావడంతో జగన్ హోదా ఉద్యమ సమయంలోని కేసులను ఎత్తివేయాలన్నారు. మన కళ్లెదుటే మాజీ సీఎం అక్రమ నిర్మాణంలో ఉన్నారన్నారు. దీన్ని మనం ఎంతవరకూ సమర్థించగలమని అన్నారు. మన కళ్లెదుటే అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తుంటే ఏం చేస్తున్నామని అన్నారు. ఇది సుపరిపాలన ఎలా అవుతుందని అన్నారు. మన వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సి ఉందన్నారు. రేపటి నుంచే అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభమవుతాయన్నారు.