మహారాష్ట్రలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని శివసేన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సాధించిన విజయాలను ప్రచారం చేసుకోవడానికి బిజెపి రథయాత్ర చేపట్టనున్నది. ఈ రథయాత్రపై శివసేన పలు ప్రశ్నలను సంధించింది. రైతు రుణ మాఫీపై గత నాలుగు సంవత్సరాలుగా పెద్దయెత్తున ప్రకటనలు ఇచ్చారని, ఇప్పటికీ అది వెలుగు చూడలేదని శివసేన తన అధికార పత్రిక సామ్నాలో సంపాదకీయంలో రాసింది. అలాగే వ్యవసాయ భూముల ఇన్సూరెన్స్ పథకం కూడా ఆగిపోయిందని ఆ సంపాదకీయంలో పేర్కొన్నారు. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తామనే ప్రకటన తప్ప వాస్తవానికి వారికి ఒరిగిందేమీ లేదని ఆ సంపాదకీయంలో పేర్కొన్నారు.