దుర్గా మల్లేశ్వరస్వామి ఆధ్వర్యంలో ఐదు రోజులుగా జరుగుతున్న వరుణయాగం ముగిసింది. పండితులు, వేదపాఠశాల విద్యార్థుల వేదమంత్రాల నడుమ దుర్గా ఘాట్లో తలపెట్టిన వరుణయాగం సహస్ర ఘటాభిషేకంతో ముగిసింది. వర్షాలు సమృద్ధిగా కురిసి, రాష్ట్రం పాడిపంటలతో కళకళలాడాలని కోరుతూ ఈనెల 20న వరుణయాగం ప్రారంభించారు. చివరి రోజైన సోమవారం సహస్ర ఘటాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. దుర్గా ఘాట్ నుంచి వేద పండితులు, వేద పాఠశాల విద్యార్థులు కుండలతో కృష్ణా జలాలను తీసుకువచ్చి దుర్గా మల్లేశ్వరస్వామికి అభిషేకం నిర్వహించారు. ఉష్ణోగ్రతలు తగ్గి, కరువు తొలగిపోయి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వరుణ యాగం నిర్వహించినట్లు ఈవో తెలిపారు.