శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్టు(శ్రీవాణి) ద్వారా ఎక్కువ ప్రాంతాలలో శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు దాతలు ముందుకురావాలని టిటిడి ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్ పిలుపునిచ్చారు. తిరుపతిలోని తన కార్యాలయంలో మంగళవారం ఉదయం అధికారులతో ట్రస్టుపై మొదటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ ఏడాది మే 25వ తేదీ నుండి శ్రీవాణి ట్రస్టు కార్యక్రమాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈ ట్రస్టుకు రూ.25 లక్షలు దాతలు అందించారన్నారు. ఈ ట్రస్టుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని టిటిడి వెబ్సైట్లో పొందుపర్చాలని అధికారులకు సూచించారు. టిటిడిలోని 9 ట్రస్టులు, ఒక స్కీమ్కు రూ.లక్ష ఆపైబడి విరాళాలు ఇచ్చే దాతలకు టిటిడి కల్పించే సౌకర్యాలను, శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు ఇచ్చే దాతలకు కూడా వర్తింపచేస్తామన్నారు.
దాతల సహకారంతో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల నిర్మాణం, నిర్వహణ, అర్చక శిక్షణ, తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆలయాలకు విచ్చేసే భక్తులకు అవసరమైన వసతి గృహాల నిర్మాణం, పారిశుద్ధ్య పనుల నిర్వహణ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఆలయాలలో భక్తులకు అవసరమైన తాగునీరు, నీటిని నిల్వ ఉంచేందుకు ట్యాంకులు, రోడ్లు, లైటింగ్, అన్నపస్రాదాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా పురాతన ఆలయాలు, గోపురాల మరమ్మతులు, పునర్నిర్మాణ పనులకు సహకారం అందిస్తామన్నారు. భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.