తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత దాడి చేసిన ఘటనతో అటవీశాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. ఘాట్ రోడ్డులో ద్విచక్రాల రాకపోకలను సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిలిపివేయాలని, నడకదారిని రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేయాలని ప్రతిపాదనలు చేస్తున్నారు. ఘాట్ రోడ్డులో వాహనాల వేగం గంటకు 20 కి.మీ మంచికూడదన్న ప్రతిపాదనను ఆలోచిస్తున్నారు.
తిరుమల ఘాట్ రోడ్డులో బైక్ పై వెళ్తున్న వారిపై చిరుత దాడి చేసిన క్రమంలో టీటీడీ విజిలెన్స్, ఫారెస్టు, పోలీసు అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. చిరుత దాడులు పునరావృత్తం కాకుండా ఉండేందుకు పలు సూచనలు చేశారు. ఈ ప్రతిపాదనలపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ప్రతి పాదనలు అందరికీ సమ్మతమైతే ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాల రాకపోకలపైనా, నడకదారి మార్గంలోనూ ఆంక్షలు అమలులోకి రానున్నాయ.
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో సోమవారం (జూన్ 17, 2019) రాత్రి పదిన్నర సమయంలో బైక్పై వెళ్తున్న వారిపై చిరుత విరుచుకుపడింది. 9వ కిలోమీటరు దగ్గర బైక్పై వెళ్తున్న తండ్రీకూతుళ్లపై దాడి చేసింది. పావని అనే చిన్నారి కళ్లపై గోర్లతో గాయపరిచింది. మరో పది నిమిషాలకు అటుగా వెళ్తున్న భార్యాభర్తలపై మళ్లీ దాడి చేసింది. ఈ ఘటనలో యామిని అనే యువతి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని అశ్విని ఆస్పత్రికి తరలించారు.
అంతటితో ఆగని చిరుత.. ఘాట్ రోడ్డులో మళ్లీ కార్లను వెంబడించి, దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో పలువురు భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. గతంలోనూ చిరుత దాడి చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. టీటీడీ అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆరోపించారు. ఈక్రమంలోనే అటవీశాఖ అధికారులు కీలక ప్రతిపాదనలు చేశారు.