రేపు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగనున్న కీలకమైన అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అఖిలపక్షానికి వెళ్లాలా? వద్దా? అనే అంశంపై చర్చించేందుకు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు చంద్రబాబు. రేపు ప్రధాని నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి ఎవరు వెళ్లాలి అనే అంశంపై చర్చించారు. అయితే, పార్టీ అధినేతలు మాత్రమే పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కోరారు... మరోవైపు రేపటి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వెళ్లాలా? లేక పార్లమెంటరీ పార్టీ నేతను పంపాలా? అనే ఆలోచనలో కూడా చేశారు. కానీ, చివరకు ఈ భేటీకి దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అజెండాలోని అంశాలపై పార్టీ నుంచి లేఖను పంపాలని నిర్ణయించారు. రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాతే జమిలి ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని లేఖలో కోరనుంది టీడీపీ.