ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఈ రోజు సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మీ మిత్రపక్షమైన బీజేపీని ఒప్పించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చేయండి.. ’ అని ఆయన అధికార వైసీపీని కోరారు. దీంతో… కొద్ది సేపు అసెంబ్లీలో దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయలేదని.. కనీసం పొత్తు కూడా పెట్టుకోలేదని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ‘జనసేన ఎమ్మెల్యే ఏదిపడితే అది మాట్లాడితే కుదరదు.. టీడీపీతో జనసేన లోపాయకారీ పొత్తు విషయం అందరికీ తెలిసిందే. కేంద్రంతో పోట్లాడే పరిస్థితి లేదు. సఖ్యతగా ఉంటూ హోదా సాధనకు కృషి చేస్తాం’ అని అన్నారు.
అంతకుముందు రాపాక మాట్లాడుతూ.. మంత్రివర్గంలో బడుగు, బలహీన వర్గాలకు చోటు కల్పించడం శుభపరిణామని కొనియాడారు. ఎస్సీ వర్గానికి చెందిన మేకతోటి సుచరితకు హోంమంత్రి పదవి ఇవ్వడం గొప్ప విషయమని పేర్కొన్నారు. అమ్మఒడి పథకం మంచి పథకమని.. ప్రభుత్వ స్కూళ్లు మూతపడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు.