మార్చి 2014లోనే ప్రత్యేక హోదాకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిసిందని, ఏడు నెలల తర్వాత నీతి ఆయోగ్ వచ్చిందని ఏపీ సీఎం జగన్ గుర్తు చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, అప్పటి వరకూ హోదా గురించి చంద్రబాబు పట్టించుకోలేదని, నీతి ఆయోగ్ ఏర్పడిన తొమ్మిది నెలల తర్వాత బాబు స్పందించారని విమర్శించారు. దీనిని బట్టి హోదాపై చంద్రబాబు చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీ అమలు చేయాలని ప్లానింగ్ కమిషన్ ను చంద్రబాబు అడిగారా? అని చంద్రబాబును ప్రశ్నించారు. హాదా హామీ అమలు చేయాలని ప్లానింగ్ కమిషన్ కు కనీసం ఓ లేఖ కూడా చంద్రబాబు రాయలేదని విమర్శించారు. ఏపీకి ముంపు మండలాలు ఇవ్వకపోతే సీఎంగా ప్రమాణస్వీకారం కూడా చేయనని చెబుతున్న చంద్రబాబు, ప్రత్యేక హోదా ఏం పాపం చేసిందని దాని కోసం పోరాడకుండా వదిలేశారని ప్రశ్నించారు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడతారని, ఆయన మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.