ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే తీర్మానాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు. స్పెషల్ స్టేటస్ వస్తే రాష్ట్రానికి అత్యధికంగా గ్రాంట్లు వస్తాయని అన్నారు. ప్రస్తుతం రూ. 3 వేల కోట్ల గ్రాంట్లు మాత్రమే లభిస్తున్నాయని తెలిపారు. విభజన సమయంలో పార్లమెంటులో చేసిన వాగ్దానాలను నెరవేర్చలేదని చెప్పారు. హోదా ఇవ్వకపోవడానికి చాలా సాకులు ఉన్నాయని అన్నారు. 2014లో హోదాపై కేంద్రం తీర్మానం కూడా చేసిందని తెలిపారు. విభజన సమయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ఆదాయాన్ని, ఉద్యోగాలను ఇచ్చే హైదరాబాదును కోల్పోయామని చెప్పారు. విభజన ఫలితంగా ఉమ్మడి రాష్ట్ర అప్పులను వారసత్వంగా పొందామని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ తమకు అవసరం లేదని... హోదానే కావాలని అన్నారు.
గత ఐదేళ్లలో రాష్ట్రానికి రూ. 66,300 కోట్ల రెవెన్యూ లోటు ఉందని అన్నారు. రాష్ట్రంలో ఉపాధి కల్పన సామర్థ్యం తగ్గిపోయిందని ఉద్యోగాల కోసం యువత ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని తెలిపారు. కేవలం ప్రత్యేక హోదా ద్వారానే విభజన నష్టాలను పూడ్చుకోవచ్చని చెప్పారు. పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా ప్రత్యేక హోదానే అవసరమని అన్నారు. 14 ఆర్థిక సంఘం సిఫారసు పేరుతో ప్రత్యేక హోదాను ఇవ్వడం లేదని చెప్పారు. ప్రణాళికసంఘంతో గత టీడీపీ ప్రభుత్వం మాట్లాడకపోవడం వల్లే హోదా రాలేదని ఆరోపించారు. విభజనతో నష్టపోయినదాన్ని ప్రత్యేక హోదాతో భర్తీ చేస్తామని పార్లమెంటు సాక్షిగా అప్పట్లో హామీ ఇచ్చారని అన్నారు. ఒక్క విభజన హామీని కూడా నెరవేర్చలేదని చెప్పారు.