భగవంతుడు ముందు అంతా సమానమని వేదాలు పురాణజాలు ఘోషిస్తుంటే, తిరుమలలో మాత్రం భక్తులను విభజించి శ్రీవారి దర్శనం చేయిస్తున్నారని, పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకుంటున్నారంటూ ఓ భక్తుడు కోర్టును ఆశ్రయించాడు. వివిఐపి బ్రేక్ దర్శనాలంటూ ఎల్1, ఎల్2, ఎల్3 లుగా విభజిస్తున్నారని, సామాన్యులకు దర్శనంలో అనేక ఇబ్బందులు కలిగిస్తున్నారని, పిటీషనర్ ఈ సందర్భంగా ఆరోపించారు. చట్టంలో ఎక్కడా ఇలాంటి అవకాశం లేదని, భక్తులను విభజించడం సమాన హక్కును హరించడమేనని పేర్కొన్నాడు. విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు బోర్డు సభ్యులు, అధికారులకు కేటాయించి దుర్వినయోగం చేస్తున్నారని ఆరోపించారు.
అసలు దర్శనం టికెట్ల కేటాయింపులలో పారదర్శకత ఉండటం లేదన్న ఆరోపణలు వినిపిస్తునే ఉన్నాయి. ఏ రోజు ఏ బోర్డు సభ్యుడు, ఏ ఎంఎల్ఏ, ఏ ఎంపి ఎన్ని టికెట్లు తీసుకున్నారు, ఎవరి కోసం తీసుకున్నారు అనే వివరాలు ఏరోజుకు ఆ రోజు వెల్లడించాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ టిటిడి పట్టించుకున్న దాఖలాలు లేనే లేవని చెప్పాలి. జనంకి తెలియాల్సిన ఈ టికెట్లు కేటాయింపు వ్యవహారం పూర్తిగా రహస్య వ్యవహారంగా మార్చేసారు. విఐపిల పేరుతో తీసుకుంటున్న టికెట్లు బ్లాక్మార్కెట్కు తరలుతున్నాయి. అనేక మంది దళారులు పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. రూ.500 టికెట్లు 10 వేలకు, 15 వేలకు అమ్మిన ఉదంతాలున్నాయి. ఇలాంటి వాటికి బ్రేక్ వేయాలన్నా టికెట్లు కేటాయింపులో పారదర్శకత తీసుకురావాల్సిన అవసరం ఉందని, బ్రేక్ దర్శనాల టికెట్లు తీసుకుంటున్న వారి వివరాలను టిటిడి వెబ్సైట్లో పెట్టాలన్నడిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.