అమరావతి : వివా దాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ సవాల్కు విజయవాడ పోలీసులు బదులిచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పై పైపులరోడ్డులో బహిరంగ విలేకరు ల సమావేశం నిర్వహించనున్నట్లు రామ్గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా చేసిన ప్రకటనపై విజయవాడ పోలీసు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గత నెలలో ఎన్నికల కోడ్ అమలులో వుండగానే, లక్ష్మీస్ ఎన్టీ ఆర్ సినిమా ప్రదర్శనకు సంబంధించి విజయవాడలో విలేకరుల సమావేశం నిర్వహించేందుకు రామ్గోపాల్ వర్మ విఫలయత్నం చేశారు. రెండు స్టార్ హోటల్స్లో విలేకరుల సమావేశ నిర్వహణకు యాజమాన్యాలు నిరాకరించడం తో అజిత్సింగ్నగర్ పైపులరోడ్డు సమీపంలోని ఎన్టిఆర్ సర్కిల్ వద్ద సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా చిత్ర నిర్మాత రాకేష్రెడ్డితో కలిసి విజయవాడ చేరుకున్న రామ్గోపాల్ వర్మను గన్నవరం విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. నాలుగు గంటల పాటు అక్కడే ఉంచి మరో ఫ్లైట్లో వెనక్కి పంపారు. దీనిపై అప్పట్లో రామ్గోపాల్ వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మరెప్పుడూ రామ్గోపాల్ వర్మ ఈ విషయంపై స్పందించ లేదు. గురువారం ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత శుక్రవారం తాజాగా రామ్గోపాల్ వర్మ మరో ట్వీట్ చేశారు. గత నెలలో తన విలేకరుల సమావేశం నిర్వహణకు పోలీసులు నిరాకరించిన పైపులరోడ్ జంక్షన్లోనే ఆదివారం సాయంత్రం నిర్వహించను న్నట్లు పేర్కొన్నారు.
నిజమైన ఎన్టిఆర్ అభిమానులు పాల్గొనాలని పేర్కొన్న రామ్గోపాల్ వర్మ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చేశారు. రామ్గోపాల్ వర్మ ట్వీట్కు విజయవాడ పోలీసులు స్పందించారు. ట్విట్టర్లో సమాధానం ఇవ్వడంతో పాటు నార్త్జోన్ ఏసీపీ కె.రమేష్బాబు పేరిట జారీ చేసిన ప్రకటనలో కార్యక్రమం నిర్వహించాలనుకుంటున్న ప్రాంతం బహిరంగ ప్రదేశం అయినందున వ్యతిరేక వర్గం అడ్డుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఘర్షణలు చోటు చేసుకుంటే ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉన్నందున కార్యక్రమ నిర్వహణపై పునరాలోచన చేయాలని కోరారు. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రెస్క్లబ్, మరేదైనా ఇతర కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించాలని సూచించారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో సెక్షన్ 30 పోలీసు యాక్ట్, సెక్షన్ 144 సీఆర్పీసీ అమలులో ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో కార్యక్రమాల నిర్వహణకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని పేర్కొంటూ అనుమతి లేని కార్యక్రమాలు నిషేధం అని తెలిపారు. పైపులరోడ్డు జంక్షన్ విజయవాడ-హైదరాబాద్ జంక్షన్ కావడంతో నిత్యం రద్దీగా ఉంటుందని, పరిసర ప్రాంతాల్లోని పాఠశాలలు, కాలేజీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రూప్-1 పరీక్షలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. వీటన్నింటి దృష్ట్యా మరో ప్రాంతానికి వేదిక మార్చి పోలీసులకు సహకరించాలని పేర్కొన్నారు.