పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. చరిత్రలో నిలిచిపోయేలా వైసీపీ విజయం సాధించిందని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. విశ్వసనీయతకు ప్రజలు ఓటేశారని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా వైసీపీ అండగా నిలిచిందన్నారు. ప్రజలు పార్టీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రతి ఒక్కరి విజయంగా అభివర్ణించిన జగన్ 2024 అధికారం కోసం ఇప్పటి నుంచే సుపరిపాలన అందించాలన్నారు. దేశమంతా రాష్ట్రం వైపు చూసేలా ప్రక్షాళన చేస్తానంటూ జగన్ ప్రకటించారు. అధికారం ఉంది కదా అని అక్రమాలు చేస్తే దేవుడు ఎలాంటి మొట్టి కాయలు వేస్తాడో చూశామన్నారు. ఆరు నెలల్లోనే మంచి పాలన అందిస్తున్న ముఖ్యమంత్రిగా గుర్తింపు తెచ్చుకుంటానంటూ ఎమ్మెల్యేలకు జగన్ హామి ఇచ్చారు. వైసీపీ నుంచి ఎన్నికైన 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలను చంద్రబాబు లాక్కున్నారని ఇప్పుడు టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు మిగిలారని వ్యాఖ్యానించారు. అంతకుముందు వైఎస్ఆర్ఎల్పీ నేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో భేటి అయిన పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు జగన్ను తమ పార్టీ పక్ష నేతగా ఎన్నుకున్నట్టు ప్రకటించారు. సీనియర్నేత, చీపురుపల్లి శాసనసభ్యుడు బొత్స సత్యానారాయణ జగన్ పేరును ప్రతిపాదిస్తూ ఏక వాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, ముస్తఫా ఈ తీర్మానాన్ని బలపరిచారు. అనంతరం సభ్యులంతా తమ ఆమోదం తెలిపారు.