భారతీయ సనాతన ధర్మంలోని మానవీయ నైతిక విలువలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మే 27 నుండి జూన్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న శుభప్రదం వేసవి శిక్షణ తరగతులకు విస్తృత ఏర్పాట్లు చేపట్టామని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో శనివారం అధికారులతో వారపు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ శుభప్రదం శిక్షణ తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు నాణ్యమైన భోజనం, తాగునీరు, వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా పారిశుద్ధ్యం, భద్రత తదితర చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతిలోని టిటిడి విద్యాసంస్థలైన ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్పిడబ్ల్యు డిగ్రీ కళాశాల, ఎస్జిఎస్ ఆర్ట్స్ కళాశాల, ఎస్వీ జూనియర్ కళాశాల, ఎస్పిడబ్ల్యు జూనియర్ కళాశాల, ఓరియంటల్ కళాశాల, ఎస్పిడబ్ల్యు పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, ఇందుకోసం ఆయా కళాశాలల్లో ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
ఉచిత మెగా వైద్య శిబిరం:టిటిడి ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు, పెన్షనర్లకు జూన్ 1, 2వ తేదీల్లో తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కేంద్రీయ వైద్యశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టాలని ముఖ్య వైద్యాధికారిని జెఈవో ఆదేశించారు. రక్త పరీక్షలు, ఇసిజి, ఎక్స్రే, షుగర్, బిపి తదితర వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
టిటిడి వెబ్సైట్:టిటిడి వెబ్సైట్ను భక్తులకు మరింత సౌకర్యవంతంగా, తాజా సమాచారంతో తీర్చిదిద్దాలని జెఈవో ఐటి అధికారులను ఆదేశించారు. డ్యాష్బోర్డులో దర్శనం, ఆర్జిత సేవలు, వసతి, హుండీ ఆదాయం, కల్యాణకట్ట, విరాళాలు తదితర తాజా సమాచారాన్ని పొందుపరచాలన్నారు. టిటిడి స్థానికాలయాలు, సప్తగిరి మాసపత్రిక, డైరీలు, క్యాలెండర్లు, కల్యాణమండపాలు తదితర సమగ్ర వివరాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం శాఖలవారీగా జరుగుతున్న అభివృద్ధి పనులపై జెఈవో సమీక్ష నిర్వహించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.