2024లో ఇంతకన్నా ఎక్కువ సీట్లతో గెలవాలి ఇదే మన టార్గట్ కావాలి అన్నారు వైసిపి అధినేత వైఎస్ జగన్ . శనివారం జరగిన వైఎస్ఆర్ ఎల్పీ సమావేశంలో ఆయన పార్టీ తరపున గెలిచిన అభ్యర్ధులతో మాట్లాడుతూ చంద్రబాబుపై కామెంట్స్ చేసారు. అన్యాయం చేస్తే దేవుడు మొట్టికాయలు వేస్తాడనడానికి చంద్రబాబే నిదర్శనం అని వ్యాఖ్యానించారు. మన పార్టీ నుంచి అన్యాయంగా చంద్రబాబు కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలు 23, ఎంపీలు ముగ్గురు ఇప్పుడు టీడీపీకి మిగిలింది కూడా ఇవే అంటూ వ్యంగ్యంగా అన్నారు.
గత ఐదేళ్లలో ప్రజలకు ఏ కష్టమొచ్చినా అండగా వైసీపీ నిలిచిందని, అందుకే 50 శాతం ఓట్లతో ప్రజల విశ్వాసాన్ని చూరగొని అధికారంలోకి వచ్చాం 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలను స్వీప్ చేశాం అని అన్నారాయన. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొనేలా పనిచేయాలి. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ ఎవరూ చూడనివిధంగా ప్రక్షాళన చేస్తానని, దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేవిధంగా ప్రక్షాళన ఉంటుంది. ఇందుకు మీ అందరి సహాయసహకారాలు కావాలి, అందించాలని కోరారు.
త్వరలోనే పంచాయతీ ఎన్నికలు రానున్నాయి వాటిని కూడా క్లీన్స్వీప్ చేయాలి. జనం మెచ్చుకునేలా పాలన చేసి 2024లో ఇంతకంటే గొప్పగా గెలిచేలా అంతా పనిచేయాలని సూచించారు జగన్