హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ చింతపల్లి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నాయకులు గొడ్డేటి దేముడు కుమార్తె మాధవి(25) అరకు లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసిన మాధవి.. కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్పై 2,21,058 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈమె వయసు ప్రస్తుతం 25 ఏళ్ల 3 నెలలు. ఇంత చిన్న వయసులో ఎంపీగా గెలుపొంది రికార్డు సృష్టించారు. గతంలో ఈ రికార్డు 26 ఏళ్ల 13 రోజుల దుష్యంత్ చౌతాలాపై ఉండేది. అతి పిన్న వయసులోనే ఎంపీగా గెలుపొందిన మాధవి.. అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.
తండ్రి దేముడు వారసత్వంగా తొలిసారిగా మాధవి రాజకీయాల్లోకి వచ్చారు. మాధవి బీఎస్సీ, బీపీఎడ్ చదివారు. వైసీపీలో చేరే కంటే ముందు కొయ్యూరులోని గిరిజన సంక్షేమ పాఠశాలలో ఆమె పీఈటీగా పని చేశారు. 2018, ఆగస్టు నెలలో ఆమె వైసీపీలో చేరి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. 1992లో జన్మించిన మాధవి అవివాహితురాలు. ఈమె సోదరి చెల్లయమ్మ ఎస్జీటీగా పని చేస్తున్నారు. అనారోగ్యంతో గొడ్డేటి దేముడు 2015లో తుదిశ్వాస విడిచారు.