లోక్సభకు ఎన్నికైన అతి పిన్నవయస్కురాలిగా అరుదైన రికార్డు అందుకున్నారు అరకులోయ పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి గొడ్డేటి మాధవి. గతంలో దుష్యంత్ చౌతాలా(26ఏళ్ల 13 రోజులు) పేరిట ఉన్న రికార్డు ఇప్పుడు చెరిగిపోయింది. ఆమె వయసు ప్రస్తుతం 25ఏళ్ల 3నెలలు కావటంతో చిన్నవయసులో ఎంపిగా ఎన్నికైన వ్యక్తిగా సరికొత్త రికార్డు సృష్టించారామె.
సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గొడ్టేటి దేముడు కుమార్తె అయిన ఆమె వ్యాయామ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన విషయం విదితమే. తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఆమె వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి సీనియర్ రాజకీయ నేత కిషోర్ చంద్రదేవ్పై అనూహ్య విజయం అందుకున్నారు. అసలు తను రాజకీయాలలోకి రావటంపై ఆమె స్పందిస్తూ తను గురుకుల విద్యాలయంలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సమయంలో ఒకసారి విద్యార్థినికి ఆరోగ్యం బాగుండకపోతే పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాను. అక్కడ వైద్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్యం అందించలేదు సరికదా చివరికి ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేస్తేగానీ వైద్యులు స్పందించి వైద్యం ఆరంభించలేదు. కమ్యూనిస్టు పార్టీలో ఉన్న నాన్న ప్రజలకోసం ఎందుకు పోరాటాలు చేసేవాడో అప్పుడు అర్ధమైంది. నాన్న ప్రజాప్రతినిధి అయ్యాక అధికారులు స్పందించకుంటే ధర్నాలు చేయటం చూసాదు. ఇదే సరైన మార్గమనిపించింది. అందుకే తను కూడా ప్రజా ప్రతినిధినైతేనే ఎవరికైనా ఎటువంటి సహాయమైనా చేయవచ్చునని అప్పుడే నిర్ణయించుకొన్నా, జగన్ తనకు అవకాశం ఇచ్చారు. జనం ఆశీస్సులందించి గెలిపించారు. టీడీపీ అభ్యర్థి కిశోర్చంద్రదేవ్పై 2,21,058 ఓట్ల మెజారిటీతో గెలిచిన మాధవి ఇక్కడ ఓట్లను రాబట్టే విషంలోనూ పాత రికార్డును చెరిపేశారు.