వివాదాలకు మారుపేరుగా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడైతే తనను మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ చేయించారో అదే ఎన్టీఆర్ సర్కిల్లో ఎల్లుండి నాలుగు గంటలకు ప్రెస్ మీట్ పెడుతున్నానని, అడ్డుకునేదెవరో ముందుకు రావాలంటూ సవాల్ విసిరారు. “విజయవాడలోని అదే పైపుల రోడ్డులో ప్రెస్ మీట్ పెడుతున్నా… బస్తీ మే సవాల్” అంటూ ట్వీట్ చేశారు. నిజమైన ఎన్టీఆర్ అభిమానులకు ఇది తన బహిరంగ ఆహ్వానం అంటూ చివర్లో జై జగన్ నినాదంతో ముగించారు. ఇటీవలే తన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఏపీలో రిలీజ్ చేసేందుకు వర్మ విఫలయత్నాలు చేసిన ఆయన విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్లో ప్రెస్ మీట్ పెట్టాలని ప్రయత్నించగా, పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తిప్పి పంపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో మరోసారి ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది. ఈ మేరకు ఆవేశపూరితంగా వర్మ పలు ట్వీట్లు చేసారు.