ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూరత్‌లో ఘోరం.. 19 మంది విద్యార్థులు సజీవదహనం

national |  Suryaa Desk  | Published : Fri, May 24, 2019, 06:42 PM

గుజరాత్ : సూరత్‌లోని సర్తానా ప్రాంతంలో ఇవాళ సాయంత్రం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఎగిసిపడ్డ అగ్నికీలలకు 19 మంది విద్యార్థులు సజీవదహనం అయ్యారు. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ అగ్నిప్రమాదం సర్తానాలోని తక్షశిల కాంప్లెక్స్‌లో చోటు చేసుకుంది. అయితే ఈ భవనంలోని మూడో అంతస్తులో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. మంటల నుంచి తప్పించుకునేందుకు పలువురు విద్యార్థులు కిందకు దూకారు. దీంతో పలువురి విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలను ఆర్పేందుకు 18 ఫైరింజన్లు శ్రమిస్తున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సూరత్ పోలీసు కమిషనర్ తెలిపారు. మృతులంతా 15 నుంచి 17 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారే. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


 


మోదీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తీవ్ర దిగ్భ్రాంతి


ఈ అగ్నిప్రమాద ఘటనపై నరేంద్ర మోదీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మోదీ ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని విజయ్ రూపానీ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com