బెంగళూరు : మాజీ ప్రధాని దేవేగౌడ కోసం తన సీటును త్యాగం చేస్తానని ఆయన మనువడు, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ప్రకటించారు. హసన్లో ప్రజ్వల్ రేవణ్ణ మీడియాతో మాట్లాడారు. తాత కోసం ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని చెప్పారు. ఇది తొందరపాటు నిర్ణయం కాదన్నారు. త్వరలోనే తాతను కలిసి తన నిర్ణయాన్ని చెప్తానని రేవణ్ణ పేర్కొన్నారు. కర్ణాటకకు ఏం కావాలో దేవేగౌడకు తెలుసన్నారు. రైతులు, బడుగు, బలహీన వర్గాల పక్షాన పార్లమెంట్లో తాత స్వరాన్ని వినిపించాల్సిన అవసరం ఉందని ప్రజ్వల్ రేవణ్ణ తెలిపారు. తుమకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దేవేగౌడ ఓటమి పాలయ్యారు. ప్రతీసారి హసన్ నియోజకవర్గం నుంచి దేవేగౌడ పోటీ చేసేవారు. కానీ ఈ సారి తన మనువడి కోసం హసన్ సీటును దేవేగౌడ త్యాగం చేశారు. హసన్ నియోజకవర్గంలో రేవణ్ణ గెలిచారు. ప్రజ్వల్ రేవణ్ణ ఆ రాష్ట్ర మంత్రి హెచ్డీ రేవణ్ణ కుమారుడు. ఇక సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి మాండ్యా నుంచి ఓడిపోయారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి సుమలత అంబరీష్ గెలుపొందారు