ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ (పీఎస్పీ) ప్రభంజనం సృష్టించబోతోందని చెప్పిన కేఏ పాల్ నరసాపురం లోక్సభ స్థానానికి కూడా పోటీ చేశారు. అక్కడ ఆయనకు లభించిన ఓట్లు 2639. నోటాకు లభించిన ఓట్లు 10391. ఆయనకంటే కొందరు స్వతంత్ర పార్టీల అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి.
ఆంధ్రాను అమెరికా చేస్తా’
ఎన్నికల ముందు ఆయన వివిధ టీవీ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పుకొచ్చిన పాల్... తామే అధికారంలోకి వస్తున్నామని ధీమాగా చెప్పుకొచ్చారు. నామినేషన్ నుంచి ప్రచారం వరకు పాల్ తనదైన శైలిలో వినూత్నంగా ముందుకెళ్లారు. కోట్ల రూపాయలు విరాళాలు తీసుకొచ్చి ఆంధ్ర ప్రదేశ్ను అమెరికాగా తీర్చిదిద్దుతానని కూడా పాల్ అన్నారు.
‘రష్యా జోక్యం’
ఆ తరువాత ఆయన తన మాట మర్చారు. ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని ఆరోపించారు. ఈవీఎంలో తన పార్టీ గుర్తుకు ఓటు వేస్తే అది మరొకరికి పడుతోందని, అందువల్ల ఎన్నికలు మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ ఆయన ఫేసుబుక్ ఖాతాలో వీడియోలు కూడా పోస్టు చేశారు.
నరసాపురం అసెంబ్లీ స్థానంలో వైఎస్సార్సీపీకి చెందిన ముదునూరి ప్రసాద రాజు ఆధిక్యంలో ఉన్నారు. టీడీపీ తరపున బండారు మాధవ నాయుడు బరిలో నిలిచారు.