ప్రశ్నించడం కోసం ఆరంభించిన జనసేన ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఖాతా తెరవటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహం వెల్లివిరుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ గెలుపొంది ఔరా అనిపించారు. చివరి రౌండ్ వరకూ దోబూచులాటలా సాగిన రాజోలు ఓట్ల కౌంటింగ్లో చివరికి స్వల్ప మెజార్టీతో వరప్రసాద్ విజయాన్ని సొంత చేసుకున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీకి దిగినా, ఓటమి నుంచి తప్పలేదు. ఎన్నికల తదుపరి కీలక భూమిక తమదేనని ప్రకటించుకున్నప్పటికీ ఆ పార్టీ ఒక్కసీటుకే పరిమితం కావటంతో ఆ పార్టీ శ్రేణులు అందోళన చెందుతున్న దశలో రాజోలు నుంచి ఎమ్మెల్యేగా వరప్రసాద్ గెలుపొందటం కాస్త ఊరట నిచ్చేందే. భవిష్యత్లో మరింత బలపడేందుకు ఇదే సంకేతమని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తుండటం విశేషం. కాగా జనసేనాని పవన్ సైతం వరప్రసాద్కు అభినందనలు తెలిపారు.