హైదరాబాద్: ఈవీఎం మెషీన్లపై అనుమానాలు లేవనెత్తడం సరికాదు అని బీహార్ సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. ఈవీఎంలపై వస్తున్న ఆరోపణలు బోగస్ అని తెలిపారు. ఈవీఎంలను ప్రవేశపెట్టిన తర్వాతే ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నాయన్నారు. ఈవీఎంలు అనేవి టెక్నాలజీకి సంబంధించిన అంశం అని, వాటిపై అనుమానాలు వ్యక్తం చేసినప్పుడల్లా ఈసీ తగిన సమాధానం ఇచ్చిందన్నారు. ఎన్నికల్లో ఓటమి పాలయ్యే బృందాలే ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని, ఇదేమీ కొత్తకాదు అని ఆయన అన్నారు. అమిత్ షా విందులో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన నితీశ్ .. మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేయరాదు అన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేయరాదు అని కూడా తెలిపారు. అయోధ్య వివాదాన్ని కోర్టు ప్రమేయంతోనే లేక ఇరువురి ఒప్పందంతోనే పరిష్కరించాలన్నారు. బీజేపీ నిర్ణయాలు అందరికీ తెలిసినవే అని, కానీ కూటమిలో ఉన్నప్పుడు అందరం చర్చించిన తర్వాతే నిర్ణయాలు ఉంటాయన్నారు.