హైదరాబాద్ : ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అక్రమంగా ఆస్తులు సంపాదించారన్న కేసులో హైకోర్టు ఇచ్చిన స్టే రద్దయిందని ఎసిబి కోర్టు వైకాపా నాయకురాలు లక్ష్మీపార్వతికి తెలిపింది. లక్ష్మీపార్వతి నేడు ఎసిబి కోర్టుకు హాజరయ్యారు. చంద్రబాబునాయుడు అక్రమంగా ఆస్తులను సంపాదించారంటూ లక్ష్మీపార్వతి 2005లో ఎసిబికి ఫిర్యాదు చేసింది. ఎసిబి విచారణపై చంద్రబాబునాయుడు అప్పట్లో హైకోర్టునుంచి స్టే తెచ్చుకున్నారు. అయితే ఇటీవల సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్టేలను ఎత్తివేసింది. దీనితో చంద్రబాబు కేసుపై కూడా స్టే ఎత్తివేసినట్లయింది. ఈ కేసు తదుపరి విచారణను ఎసిబి కోర్టు వచ్చే నెల 13వ తేదీకి వాయిదా వేసింది.