కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ ప్రారంభించింది. ఢిల్లీ నుంచి పాట్నాకు బయల్దేరిన రాహుల్ గాంధీ... విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఆ విమానంలో సమస్య తలెత్తిన సమయంలో ఇద్దరు సిబ్బంది సహా 10 మంది విమానంలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతున్నట్టు డీజీసీఏ ప్రకటించింది. కాగా, తాను ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్టు రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో వెల్లడించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ పాట్నాకు బయల్దేరారు. అయితే, మార్గమధ్యలోనే రాహుల్ ప్రయాణిస్తున్న విమానం ఇంజిన్లో సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో మళ్లీ ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రాహుల్ గాంధీయే వెల్లడించారు. బీహార్లోని సమస్తిపూర్, ఒడిశాలోని బాలాసోర్, మహారాష్ట్రలోని సంగంనేర్లో జరగాల్సిన ఎన్నికల ప్రచార సభలు కొంచెం ఆలస్యంగా జరుగుతాయని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.