ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ శ్రీలంకలో పర్యటిస్తున్నారు. శ్రీలంకలో ప్రతిపక్ష నేత మహింద్ర రాజపక్సేతో పాల్ భేటీ అయ్యారు. శ్రీలంకలో ఈస్టర్ పండుగ రోజు జరిగిన వరుస బాంబు పేలుళ్లపై రాజపక్సేతో కేఏ పాల్ చర్చించారు. ఈసందర్భంగా పాల్ మాట్లాడుతూ.. బాంబు పేలుళ్లలో ఇక్కడ వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి కొన్ని వందల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కొన్ని రోజులుగా ఇక్కడ ఇంటర్నెట్ లేదని, ఇప్పుడే ఆన్ అయిందని తెలిపారు. శ్రీలంక మృతుల కుటుంబాల కోసం అందరూ భగవంతుడిని ప్రార్థించాలని చెప్పారు.