రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను నిలిపివేసేందుకు వైసిపి కుట్రలు పన్నుతుందని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పసుపు-కుంకుమ పథకం నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేసినట్లు చెప్పారు. అన్నధాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా పింఛన్లపైన లేనిపోని అబాండాలు వేస్తున్నారని తెలిపారు. దైవం, ప్రజల ఆశీర్వాదం, సిఎం చంద్రబాబు అకుంటిత దీక్ష వల్ల చెప్పిన పనులన్నీ చేసి చూపించగలిగిగామన్నారు. విజయవాడలోని టిడిపి జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల శ్రీవారికి సంబంధించిన బంగారం విషయంలో ఎ2 ముద్ధాయి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పారు. అటెన్షన్ డైవర్షన్ ముఠా నాయకుడిగా విజయసాయి పని చేస్తన్నారని తెలిపారు. తెలంగాణలో 23 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకుంటే వైసిపి నేతలకు కనిపించలేదా అని ప్రశ్నించారు. అక్కడి విషయాలను పక్కదారి పట్టించేందుకే టిడిపి, టిటిడి బంగారంపై ట్వీట్లు పెడుతున్నారని చెప్పారు. వై.ఎస్ సిఎంగా ఉన్నప్పుడు ఏడు కొండలను రెండు కొండలేనన్నారని అనంతరం ఏం జరిగిందో అందరికీ తెలసిన విషయమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే బ్యాంకుల పరిధిలో జరిగిన బంగారం తరలిస్తే ఆ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు వినియోగించుకుంటున్నారని చెప్పారు.