హైదరాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ తన ఎన్నికల మ్యానిఫెస్టోను రిలీజ్ చేసింది. భారతీయ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడమే 2019 ఎన్నికల మ్యానిఫెస్టో అని ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. భారత ఐక్యత ప్రమాదంలో ఉందని, అందుకే విచ్ఛిన్నకర శక్తుల నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు ఆ మ్యానిఫెస్టోను తయారు చేశామని సీఎం కేజ్రీ అన్నారు. ఢిల్లీలోకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలన్న డిమాండ్ కూడా చేశారు. కేంద్ర సర్కారు ఏర్పాటులో ఢిల్లీ పరిధిలోని ఏడు సీట్లు కీలకం కానున్నాయని కేజ్రీ తెలిపారు. మహిళల భద్రత, ఆరోగ్యం, కాలుష్యం, అవినీతి లాంటి అంశాలు ఢిల్లీని పీడిస్తున్నాయని, రాష్ట్రం చేతులను కేంద్రం కట్టడి చేయడం వల్లే ఈ ప్రమాదం తలెత్తినట్లు కేజ్రీ చెప్పారు. ఢిల్లీలో ఆప్ మ్యానిఫెస్టోను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఉన్నారు.