తిరుమల: బంగారం తరలింపు విషయంలో పూర్తి బాధ్యత పంజాబ్ నేషనల్ బ్యాంక్దేనని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్కుమార్ సింఘాల్ అన్నారు. బంగారం ఎలా తరలిస్తారు? ఏ వాహనంలో తీసుకొస్తారు? వంటి వివరాలతో తమకు సంబంధం లేదని చెప్పారు. బంగారం తరలింపు వివాదంపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. తితిదే బంగారం వచ్చినందున మరింత స్పష్టత ఇస్తున్నట్లు చెప్పారు.
‘‘గోల్డ్ డిపాజిట్ స్కీం 2000 ఏప్రిల్ 1న ప్రారంభమైంది. ఎస్బీఐలో 5,387 కిలోల బంగారం ఉంది. పీపీఎన్బీలో 1381 కిలోల బంగారం ఉంది. తితిదేకు సంబంధించి మొత్తం 9,259 కిలోల బంగారం ఉంది. 2016 ఏప్రిల్లో పీఎన్బీలో 1381 కిలోల బంగారం వేశాం. అది 2019 ఏప్రిల్ 18కి మెచ్యురిటీ అయ్యింది. మెచ్యురిటీ అంశంపై మార్చి 27నే పీఎన్బీకి లేఖ రాశాం. బంగారం తరలింపు అంశం పూర్తి బాధ్యత పీఎన్బీదే. పీఎన్బీ వచ్చి ట్రెజరీలో ఇస్తే అది తితిదే బంగారం అవుతుంది. ఈసీ సీజ్ చేసేటప్పుడు డాక్యుమెంట్లు ఉన్నాయని పీఎన్బీ మాతో చెప్పింది. ఈసీ అధికారులకు డాక్యుమెంట్లు చూపామని ఫోన్లో చెప్పారు. వాళ్లు ఈసీకి ఎలాంటి డాక్యుమెంట్లు చూపారో మాకు తెలియదు. మేం మార్చి 27న లేఖ రాసేటప్పుడు ఏప్రిల్ 18న రావాలని చెప్పాం. ఏప్రిల్ 18కి బదులు ఏప్రిల్ 20న బంగారం అందజేశారు. బంగారం ఎలా తరలిస్తారో.. ఏ వాహనంలో తీసుకొస్తారో మనకెలా తెలుస్తుంది. బంగారం మాకు వచ్చేంత వరకు మిగిలిన విషయాలు అవసరం లేదు. బంగారం ఎలా వస్తే మాకేంటి? మాకు బంగారం అందిందా లేదా అనేది ముఖ్యం. వడ్డీరేట్లు గోల్డ్ డిపాజిట్ స్కీ్మ్లో బాగా వస్తాయా లేదా అనేది బోర్డు నిర్ణయం. కేజీ బంగారం డిపాజిట్ చేయాలన్నా బోర్డు నిర్ణయం తీసుకుంటాం. తితిదేకు ఏవిధంగా ఆదాయం ఎక్కువగా వస్తుందో వంటి నిర్ణయాలు బోర్డు పని. బంగారం విషయంలో తితిదే బోర్డు సమావేశం ఏర్పాటు చేస్తామంటే ఎలాంటి అభ్యంతరం లేదు’’ అని సింఘాల్ వివరించారు.