వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలనీ, ఓ సీఏ అయివుండీ... లెక్కలు తప్పుగా వేస్తున్నారని జనసేన నుంచీ బరిలో దిగిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ... వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ట్వీట్ వెయ్యడంతో మొదలైన మాటల యుద్ధం కొనసాగుతోంది. తనను విమర్శించిన లక్ష్మీ నారాయణను విజయసాయి రెడ్డి గట్టిగానే తిప్పికొట్టారు. జేడీ గారూ.. మీ టికెట్ల లోగుట్టు అందరికీ తెలిసిందే. తీర్థం (బీఫామ్ మీద సంతకం) జనసేనది. ప్రసాదం (ఎన్నికల్లో వెదజల్లే డబ్బు) తెలుగుదేశం పార్టీది! జనసేన తనకు తానుగా ఇచ్చింది 175లో 65 బీఫామ్లు. కాదు మొత్తం తెలుగుదేశం చెబితేనే ఇచ్చాం అని మీరు ఒప్పుకోదలుచుకుంటే మీ ఇష్టం!’ అని విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ మాటల యుద్ధాన్ని విజయసాయి రెడ్డి మరిన్ని ట్వీట్లతో కొనసాగించారు.
ఇది ఇలాగే కంటిన్యూ అయితే తన టైం వేస్టవుతుందని అనుకున్న లక్ష్మీ నారాయణ... ఈ ట్వీట్ వార్కి చెక్ పెట్టేలా ఓ ట్వీట్ చేశారు. విజయసాయి రెడ్డి ట్వీట్లకు తన బదులు... తన జన సైనికులు సమాధానం చెబుతారనీ, తన టైం వేస్ట్ చేసుకోలేననీ లక్ష్మీ నారాయణ తేల్చేశారు.సో, ఇకపై విజయసాయి రెడ్డి... లక్ష్మీనారాయణపై ఏ ట్వీట్ చేసినా... దానికి సమాధానం లక్ష్మీ నారాయణ బదులు... జనసేన మాత్రమే ఇస్తారని అర్థమైపోతుంది. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి మరిన్ని విమర్శలు చేస్తారా... లేక తన టైం కూడా వేస్ట్ అనుకుంటూ... ఈ వార్ని ఇక్కడితో ముగిస్తారా అన్నది ఆయనే తేల్చాల్సి ఉంది.