కరణ్ జొహార్ చాట్ షోలో పాల్గొని ఇష్టానుసారం మాట్లాడి అడ్డంగా బుక్ అయిన హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ లకు భారీ జరిమానా పడింది. వీరి వేయాల్సిన శిక్ష గురించి విచారించిన కమిటీ.. వారికి చెరో ఇరవై లక్షల రూపాయల జరిమానా విధించింది. బీసీసీఐ అనుమతి ఏదీ తీసుకోకుండా టీవీ చాట్ షోకు హాజరైన ఈ క్రికెటర్లు అక్కడ చేసిన వ్యాఖ్యానాలు దుమారం రేపాయి. తను ఒక ప్లేబాయ్ నంటూ చెప్పుకొచ్చాడు హార్ధిక్ పాండ్యా. ఆ షో లో కేఎల్ రాహుల్ పెద్దగా మాట్లాడింది ఏమీ లేదు. పాండ్యానే చెలరేగిపోయాడు. ఇష్టానుసారం మాట్లాడాడు.
తను లెక్కలేనంతమంది అమ్మాయిలతో గడిపినట్టుగా చెప్పుకొచ్చాడు. ఆ వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. తను పొందిన శృంగార అనుభవాల గురించి తన తల్లిదండ్రులకు కూడా చెబుతానంటూ పాండ్యా వ్యాఖ్యానించాడు. ఆ చాట్ షో ప్రసారం సమయానికి వీరు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. అది దుమారం రేపడంతో వీరిని బీసీసీఐ వెనక్కు పిలిపిచింది.కొన్ని మ్యాచ్ లకు కూడా వీరు దూరం అయ్యారు. దాంతోనే భారీ నష్టం వాటిల్లింది. అయితే వీరి లక్ ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యారు. ఇక వీరి తీరుపై విచారణ మాత్రం కొనసాగింది.చివరకు చెరో ఇరవై లక్షల రూపాయల జరిమానా విధించింది కమిటీ. ఆ డబ్బును వీరు అమరజవాన్ల కుటుంబాలకు, అంధుల క్రికెట్ అసోషియేషన్ కు చెల్లించాలని బీసీసీఐ కమిటీ ఆదేశించడం గమనార్హం.