రాజ్యసభ సభ్యుడు, తెదేపా నేత సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. శ్రీనగర్ కాలనీలోని వాసవి భువన అపార్ట్మెంట్లో నివస్తున్న సీఎం రమేశ్ అక్క కుమారుడు ధర్మారామ్ ఆ భవనం ఆరో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్మారామ్ అమీర్పేట్లోని నారాయణ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. గణితం పరీక్షలో ఫెయిల్ అవడంతో మానసికంగా ఒత్తిడికి గురయ్యాడు. తన తండ్రి, సోదరికి మెసేజ్ పెట్టిన అనంతరం ఆరో అంతస్తు టెర్రస్ పైకి వెళ్లి అక్కడి నుంచి కిందికి దూకేశాడు. అదే సమయంలో ఐదో అంతస్తులో ఉన్న ధర్మారామ్ సోదరి శబ్దం విని వెళ్లి చూడగా రక్తపు మడుగులో కనిపించాడు. వెంటనే ధర్మారామ్ను యశోద ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.