ఎన్నికల వేళ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ... మాటల యుద్ధానికి దిగి నేతలు ఎదురెదురు పడిన వేళ పలకరించుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును , జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలుసుకున్నారు. ఒకరిని ఒకరు పలకరించుకున్నారు. రామోజీరావు మనవరాలు కీర్తి వివాహం సందర్బంగా హైదరాబాద్కు వచ్చిన ఇద్దరు... ఈ వేదికపై చిరునవ్వులు చిందించారు. వధువు, వరులను ఆశీర్వదించిన చంద్రబాబు.. తిరుమల స్వామివారి ప్రసాదాల్ని బహుమతిగా అందించారు. ఆతర్వాత చంద్రబాబు కిందకు వస్తుంటే ఆయనకు పవన్ కల్యాణ్ ఎదురయ్యారు. వెంటనే వీరిద్దరు నవ్వుతూ ఒకరినొకరు పలకరించుకున్నారు. నమస్కారాలు చేసుకుంటూ కాసేపు ముచ్చటించుకున్నారు. గతేడాది అమరావతిలో జరిగిన ఓ ఆలయ విగ్రహ ప్రతిష్ఠలో కలుసుకున్న వీరిద్దరూ తిరిగి ఎదురుఎదురుగా కలుసుకోవడం ఇదే తొలిసారి. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసిన పవన్ కల్యాణ్...ఈసారి మాత్రం సొంత పార్టీ జనసేన తరపున ఎన్నికల బరిలోకి దిగారు. భీమవరం, గాజువాక ప్రాంతాల నుంచి పోటీ చేశారు. అయితే ఎన్నికల ప్రచారంలో జగన్,మోదీలపై విమర్శలు చేసిన పవన్ కల్యాణ్ చంద్రబాబపై పెద్దగా ఆరోపణలు చేయకపోవడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు ముగిసిన తర్వాత వీరిద్దరూ మరోసారి కలుసుకోవడం హాట్ టాపిక్గా మారింది.