ఏప్రిల్ 11న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థులు గెలుస్తామా? లేదా అని టెన్షన్ పడుతున్నారు. ఎవరికి వారు తాము గెలుస్తామని ధీమాగా ఉన్నా.. లోపల మాత్రం టెన్షన్ వదలడం లేదు. మే 23 వరకు ఈ టెన్షన్ తప్పేలా లేదు. దీంతో అప్పటి వరకు ఆ ఉత్కంఠను తట్టుకోలేని కొందరు నేతలు తమ జాతకం చూపించుకుంటున్నారు. కొందరు జ్యోతిష్యులను కలిసి తాము గెలుస్తామో? లేదో అని తెలుసుకుంటున్నారు. మరికొందరు నేతల అనుచరులు ఏకంగా మంత్రాల ద్వారా నేతల తలరాతలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు టీడీపీ అభ్యర్థులు ఆంధ్రా ఆక్టోపస్గా పేరుపొందిన లగడపాటి రాజగోపాల్ను సంప్రదిస్తున్నారు. టీడీపీ అభ్యర్థుల నుంచి ఫోన్ల తాకిడి ఎక్కువయ్యేసరికి లగడపాటి కూడా ఒక్కొక్కరికి ‘జాతకాలు’ చెప్పడానికి నిరాకరిస్తున్నట్టు సమాచారం. మే 19న చివరిదశ ఎన్నికలు ముగిసే వరకు చెప్పడానికి వీలుకాదని చెబుతున్నారట. అయితే, అన్ని వివరాలు చంద్రబాబు వద్దే ఉన్నాయని చెబుతున్నారట. ఈనెల 19న చంద్రబాబు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశం అయ్యారు. వారి వారి నియోజకవర్గాల్లో పోలింగ్ సరళిని బట్టి గెలిచే అవకాశం ఉందో వివరాలు తెలుసుకున్నారు.