వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీబీఐ మాజీ జేడీ, జనసేన విశాఖ లోక్సభ అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణ ఖండించారు. జనసేన సొంతంగా 65 స్థానాల్లో పోటీచేస్తే 88 సీట్లు ఎలా గెలుస్తుందంటూ చేసిన ట్వీట్పై గట్టిగా బదులిచ్చారు. జనసేన సొంతంగా 140 స్థానాల్లో.. బీఎస్పీ, వామపక్షాలతో కలిసి 35 సీట్లలో పోటీ చేసినట్టు తన ట్విటర్ ఖాతాలో వివరించారు. తమ లెక్కలు ఎప్పుడూ కచ్చితంగా, నిజాయితీగా ఉంటాయని స్పష్టంచేశారు. సత్యం, ధర్మం ప్రకారమే తాము పనిచేస్తామన్నారు. సీఏ చదివిన మీ లెక్కలు ఎందుకు తప్పాయో ఆలోచించుకోవాలని విజయసాయిరెడ్డికి హితవు పలికారు. మీ తప్పుడు లెక్కల వల్ల చాలా మంది ఇరుక్కున్నారన్నారు. ఇప్పటికైనా సరిగా లెక్కలు వేయడం నేర్చుకోవాలని సూచించారు.