ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో ఈరోజు మందుబాబులు రెచ్చిపోయారు. రోడ్డుపై వెళుతున్న కొందరు హిజ్రాలను చుట్టుముట్టి చావగొట్టారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. జిల్లాలోని విజయవాడ ఇబ్రహీంపట్నంలో దాదాపు 10 మంది యువకులు పూటుగా మద్యం సేవించి రోడ్డు పక్కనే కూర్చున్నారు. అదే సమయంలో అటుగా వెళుతున్న హిజ్రాలపై వీరి కన్నుపడింది.
వెంటనే అక్కడకు వెళ్లిన మందుబాబులు వారితో గొడవ పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో ఈ 10 మంది యువకులు రెచ్చిపోయారు. దొరికినవారిని దొరికినట్లు చితకబాదారు. చివరికి మందుబాబుల దాడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. తమపై తాగుబోతు యువకులు దాడిచేయడంపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.