ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, కోస్తాంధ్రలో వచ్చే మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపారు. ఇక రాయలసీమలో ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు రెండు, మూడు డిగ్రీలు అదనంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు, తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.