సీనియర్ ఐపీఎస్ అధికారి, రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం, బెదిరింపు కేసులో తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో ఈ వివాదం సంచలనం అయింది. ఈ వివాదంపై మీడియాలో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను అప్పట్లో ఆదేశించింది. ఈ కేసు విచారణకు రాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నోటీసు జారీచేసి తదుపరి విచారణను జూన్కు వాయిదా వేసింది.