శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానంలో జరుగుతున్న చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన గురువారం సాయంత్రం నిర్వహించిన నగరోత్సవంలో శ్రీ గంగా, పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్లు సింహ వాహనంపై ఊరేగారు. మేళతాళాలు, మహిళల కోలాట నృత్యాలు, భక్తుల శివనామ స్మరణ నడుమ నగరోత్సవం కనుల పండువగా సాగింది. మల్లిఖార్జున మహామండపం నుండి బయలుదేరిన నగరోత్సవాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారిణి వలనుకొండ కోటేశ్వరమ్మ పూజా కార్యక్రమం నిర్వహించి రథానికి హారతులు పట్టి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు వారు ఆధ్వర్యంలో నగరోత్సవం కనక దుర్గానగర్, రధం సెంటర్, వినాయకుని గుడి, కెనాల్ రోడ్డు మీదుగా దుర్గా ఘాట్కు చేరుకుని అక్కడ కృష్ణా హారతులు ముగిసిన అనంతరం ఘాట్ రోడ్ మీదుగా అమ్మవారి ఆలయము వద్దకు చేరుకుంది. నగరోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ వైధిక కమిటీ సిబ్బంది, వేదపండితులు, అర్చకులు, ఇంజనీరింగు సిబ్బంది పాల్గొన్నారు. శుక్రవారం జరిగే నగరోత్సవంలో దుర్గామల్లేశ్వరులు వెండి రథంపై ఊరేగనున్నారు. ఉదయం యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించనున్నారు.