విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు మీద అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవతో విశాఖలో గూగుల్ సంస్థ లక్షా 33 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని కూటమి శ్రేణులు, కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి దిశగా ఇదో కీలకమైన, చరిత్రాత్మక ఒప్పందంగా అభివర్ణిస్తున్నారు. గూగుల్ ఏఐ హబ్ ద్వారా విశాఖ ఏఐ సిటీగా రూపాంతరం చెందుతుందంటున్నారు. విశాఖలో గూగుల్ పెట్టుబడుల ద్వారా మరిన్ని సంస్థలు వైజాగ్ వైపు దృష్టి సారిస్తాయంటున్నారు.
అయితే వైసీపీ మాత్రం ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేనంటోంది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వలన భారీగా ఉద్యోగాలు రావని చెప్తోంది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వలన వచ్చే ఉద్యోగాలు తక్కువేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వంటి నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇన్ని కొన్ని ఉద్యోగాల కోసం ఏపీ ప్రభుత్వం.. గూగుల్ సంస్థకు ఏకంగా రూ.22 వేలకోట్లు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తోందని ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు విశాఖలో గూగుల్ పెట్టుబడులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వలన లక్షా 80 వేల ఉద్యోగాలు వస్తాయనే మాట అవాస్తమని అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన విష్ణు కుమార్ రాజు.. గూగుల్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయని చాలా మందికి అనుమానాలు ఉన్నాయన్నారు, డేటా సెంటర్ అంటే కాల్ సెంటర్ కాదని అన్నారు. సమాచారాన్ని స్టోర్ చేస్తుందని తెలిపారు. గూగుల్ సంస్థలో1.80 లక్షల ఉద్యోగాలు వస్తాయనేది సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ప్రత్యక్షంగా అన్ని ఉద్యోగాలు రావన్నారు. డేటా సెంటర్ వలన ఎక్కువ ఉద్యోగాలు రావన్న విష్ణుకుమార్ రాజు.. అయితే ఇక్కడ ఉద్యోగాలు సమస్య కాదని చెప్పుకొచ్చారు. దీంతో విష్ణు కుమార్ రాజు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మరోవైపు ఏపీ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఆగస్ట్ 15 నుంచి అమలవుతోంది. గుర్తింపు కార్డులు చూపించి మహిళలు ఐదు రకాల బస్సులలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని పొందుతున్నారు. అయితే ఉచిత బస్సు పథకంపైనా విష్ణు కుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత బస్సు పథకంతో ప్రయాణంలో మహిళల డామినేషన్ ఎక్కువైందని అభిప్రాయపడ్డారు.
బస్సులో టికెట్ ఉన్న మగవాళ్లను కూడా మహిళలు బస్ నుంచి దించేస్తు్న్నారని అన్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ యూనియన్ నాయకులే చెప్తున్నారన్న విష్ణు కుమార్ రాజు.. మగవాళ్లు ఇబ్బంది పడుతున్నారని అభిప్రాయపడ్డారు. సూపర్ సిక్స్ పథకాల అమల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని విష్ణు కుమార్ రాజు అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa