పార్టీ నేతలతో సోమవారం తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రాగానే పింఛన్లను రూ.3వేలకు పెంచుతామని, వృద్ధాప్య ఫించన్ల అర్హత వయసును తగ్గిస్తామని స్పష్టం చేశారు. 300 చదరపు అడుగుల లోపు విస్తీర్ణంలో ఉచితంగా ఇళ్లు నిర్మించి తీరుతామని చెప్పారు. జగన్ తన బతుకు బాగు కోసం ఇక్కడ బతికే వారికి శాశ్వత సమాధి కట్టాలని చూస్తున్నాడని ఆక్షేపించారు. జగన్వి పిరికిపంద రాజకీయాలని, కేసీఆర్, కేటీఆర్కు భయపడుతూ వారివద్ద బానిసలా ఉన్నాడని దుయ్యబట్టారు. 60 ఏళ్లు కష్టపడిన ఆస్తులను లాగేసుకున్నారని, ఇప్పుడు జగన్ రూపంలో మనం కష్టపడి నిర్మించుకుంటున్న నవ్యాంధ్ర ఆస్తులను కూడా లాగేందుకు కుట్ర పన్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పౌరుషంతో మన ఆస్తులను మనం కాపాడుకుందామని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ఉంటున్న వారిని వేధింపులకు గురిచేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్కు తిరిగి పూర్వ వైభవం రావాలంటే ఇక్కడ అసమర్థ ప్రభుత్వం ఉండాలనేది కేసీఆర్ భావన అని చంద్రబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ తెదేపాను, వైకాపాను ఒకే గాటన కట్టడాన్ని చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. లోపల ఒకటి పెట్టుకుని, బయటకు ఒకటి చెప్పటం జగన్ తత్వమని విమర్శించారు. జగన్ లాంటి టిపికల్ నేరస్థుల విచారణకు ఎఫ్బీఐలో ప్రత్యేక చాప్టర్ ఉందన్నారు. దోచుకోవడమే తప్ప సంపద సృష్టించడం చేతకాని వ్యక్తి జగన్ అని మండిపడ్డారు.