చంద్రబాబు చందమామను తెచ్చిస్తామంటే ప్రజలు మళ్లి నమ్మాలా? అని వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిలా అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు ప్రతి ఇంటికి లక్షా 25వేలు బాకీ పడ్డారన్నారు. చంద్రబాబువి మళ్లి కొత్త అబద్ధాలు, మళ్లి మోసపు హామీలన్నారు. నిప్పు నిప్పు అని చెప్పుకుంటే తప్పు నిప్పైపోతుందా?… చంద్రబాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబుది రోజుకొక మాట, పూటకొక వేషం అని విమర్శించారు. చంద్రబాబును చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుతో పారిపోతుందన్నారు. జయంతికి, వర్ధంతికి తేడా తెలియని లోకేష్కు మంత్రి పదవి ఇచ్చారన్నారు. అ ఆ లు కూడా రానివాడికి అగ్రతాంబూలం అన్నట్టు లోకేష్ తీరు ఉందని విమర్శించారు. రాష్ట్రం దుర్మార్గంల చేతిలో పడి అల్లాడుతోందని, ఇప్పుడు పొరపాటు చేస్తే మళ్లి ఐదేళ్లు బాధపడుతుందన్నారు.
ఈ ఎన్నికలు కేసీఆర్, చంద్రబాబు మధ్య పోటీ ఎలా అవుతాయి? అని ప్రశ్నించారు. 9 ఏళ్లుగా జగనన్న విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారన్నారు. పదవుల కన్నా విశ్వసనీయతే ముఖ్యమని జగనన్న అనుకున్నారన్నారు. చంద్రబాబుకు, జగన్కు మధ్య ఎంత వ్యత్యాసముందో ప్రజలు ఆలోచించాలన్నారు. జనసేన అధినేత పవన్ ఒక యాక్టర్ అని, రాజకీయ సినిమాలో పవన్ యాక్టర్ అయితే చంద్రబాబు డైరెక్టర్ అని షర్మిలా అన్నారు. డేటా చోరీపై పవన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పవన్ నామినేషన్కు టీడీపీ క్యాడర్ వెళ్తుందని, పవన్కు ఓటేస్తే చంద్రబాబుకు ఓటేసినట్లేనని, జనసేనకు ఓటేస్తే టీడీపీకి ఓటేసినట్టేనన్నారు. వివేకా హత్య కేసును థర్డ్పార్టీకి ఇవ్వాలని పవన్ ఎందుకు ప్రశ్నించరన్నారు. మా ఇంటి పెద్దను మేమే హత్య చేస్తామా? అని ప్రశ్నించారు. రాజారెడ్డిని టీడీపీ వాళ్లే చంపారని, అప్పుడూ చంద్రబాబే సీఎంగా ఉన్నారన్నారు.