విజయవాడ: రాష్ట్రంలో భూతద్దం పట్టి వెతికినా అభివృద్ధి కనిపించడం లేదని వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిలా అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజశేఖర్రెడ్డి పాలనలో రైతులకు గిట్టుబాటు ధర ఉండేదన్నారు. వైఎస్ హయాంలో అందరికి భరోసా ఉండేదని పేర్కొన్నారు. చంద్రబాబు పాలన పాతికేళ్లు వెనక్కి నెట్టినట్ట్టు లేదా అని ప్రశ్నించారు. కనీసం మొదటి సంతకాన్ని కూడా అమలు చేయలేదని విమర్శించారు. 87వేల కోట్ల రైతు రుణాలను 24వేల కోట్లకు కుదించారన్నారు. డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేస్తామన్నారని, డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేమని మంత్రి సునీత ప్రకటించలేదా? అని ప్రశ్నించారు. పసుపు కుంకుమ పేరుతో మహిళలను మభ్యపెట్టడం లేదా?, కాంట్రాక్టుల కోసం పోలవరం ప్రాజెక్టును కేంద్రం నుంచి లాగేసుకోలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో గొప్పలు తప్ప రాష్ట్రాభివృద్ధి జరగలేదన్నారు.