అమరావతి: జగన్ అరాచక శక్తి అనడానికి అఫిడవిట్ నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడారు. 48 పేజీల అఫిడవిట్లో 31 కేసులు జగన్ నేరచరిత్రకు రుజువులని విమర్శించారు. దేశంలో ఎవరి అఫిడవిట్లోనూ ఇన్ని కేసులు ఉండవన్నారు. చిన్నాన్న వివేకా హత్యలోనూ రాజకీయ లాభాలు చూడటం దారుణమన్నారు. బిడ్డను ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా అనేక రకాలుగా ఆలోచిస్తామని, ఇల్లు అద్దెకు ఇచ్చేముందు అనేక రకాలుగా ఆలోచించి ఇస్తామని, మన ఓటేసే ముందు ఎన్ని ఆలోచించాలి? అని ప్రశ్నించారు.
31 కేసులున్న వారికి ఎవరైనా ఓటేస్తారా?.. అరాచకాల పార్టీకి ఎవరైనా ఓటేస్తారా? అని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్లపై న్యాయం చేస్తానంటూ జగన్ నాటకలాడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ ద్వారా ఆంధ్రాను దోచుకునేందుకు సిద్ధపడిన కేసీఆర్కు గట్టిగా గుణపాఠం చెప్పాలన్నారు. సమాజంలో నేరస్థుడిని అలాగే చూస్తామని, కానీ జగన్ రాజకీయ నేతలా చలామణి అవుతున్నారన్నారు. అరాచకాలను రెచ్చగొట్టే నీచ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.