తాను కుటుంబ పెద్దగా బాధ్యతతో ప్రవర్తించానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహిస్తున్న ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. పెద్ద కుమారుడిగా ఉంటానని చెప్పానని, చేసి చూపించానని పేర్కొన్నారు. రూ.200 నుంచి రూ.2వేలకు పింఛను పెంచిన ఘనత టీడీపీదన్నారు. ఒకప్పుడు వయస్సు మళ్లితే చూసేవారు కాదని, ఇప్పుడు అందరూ గౌరవిస్తున్నారన్నారు. పసుపు – కుంకుమ కింద ఒక్కసారి కాదు ఇస్తూనే ఉంటానన్నారు. మహిళలను ఆర్థికంగా పైకి తీసుకురావడం తన బాధ్యత అన్నారు. కష్టం, శ్రమ మనదైనా ఎన్నో అనుమానాలు భరించామన్నారు.